17, డిసెంబర్ 2024, మంగళవారం

#SGdailyStories @3 టేస్టీ


 

#SGdailyStories @3 టేస్టీ

              ‘ఏంటీ వంట, ఇంత దరిద్రంగా ఉంది, నీతా ఎక్కడా’ అని గట్టిగా అరుస్తూ ప్లేట్ విసిరేసాను, ఆ అరుపులకు ఎదురుగా వస్తున్న నీతా కాళ్లకు అడుగు దూరంలో పడింది ప్లేట్. ‘ఏంటండీ... ఏమైంది, పిచ్చలేసిందా... ఎందుకు తినే ప్లేట్ గిరాటేసారు’ అని ఆమె సైతం గట్టిగా కోప్పడుతూ అరుస్తూ వచ్చేసరికి, నా కోపం నషాలానికెక్కింది, వెంటనే అన్నం, కూరలున్న గిన్నెలను విసిరికొడుతూ ‘ఏం చేస్తున్నావు ఇంట్లో, ఖాలీగా కూర్చోకపోతే పనోళ్లు వంటలెలా చేస్తున్నారనేది కూడా చూడవా...’ అని కోప్పడుతూ సింక్ దగ్గరికి వెల్లి చేయి కడుక్కొని వెల్లిపోయాను.

           ఈ మద్య ప్రతీ చిన్నదానికి విపరీతమైన కోపం వస్తుంది, టవల్ ఎక్కడుందని, సాక్స్ కనబడట్లేదని, కీస్ దొరకలేదని పనోళ్ల మీద, నా భార్య నీతా మీద అరుస్తున్నాను. ఈ విషయం నాక్కూడా అర్థమౌతుంది, కానీ అందుకు తప్పు మాత్రం వాళ్లదే అనిపిస్తుంది, ఓ వైపు బిజినెస్ సక్సెస్ ఫుల్ గా రన్ చేయడంలో ఉండే ఇబ్బందులతో నేను బిజీగా ఉంటే, ఇంట్లో అన్ని కంపర్ట్స్ పొందుతూ నాకు సరైన సేవ చేయట్లేదని నీతాపై, జీతాలు తీసుకుంటూ నాకు కావాల్సినవి చూడట్లేదని పనోళ్లపై తెగ కోపం వస్తుంది, దీనికి తోడు కాంటినెంటల్ ఫుడ్ అలవాటై ఇంటి ఫుడ్ తినాలంటే రుచించడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఆసిఫాబాద్ అడవుల్లో పెడ్తున్న ప్యాక్టరీలో ఇబ్బందులను సరిచేయడానికి వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చి పనిమనిషిని తీసుకొని వెల్లాను.

           మొదటి రెండ్రోజులు ఇక్కడినుండి తీసుకెళ్లిన ఫుడ్ ఉండడం, లోకల్స్ తో మీటింగులు పెట్టి వారిని ఒప్పించే బిజీలో ఉండడంతో అంతగా తేడా అనిపించలేదు, ఇక మూడో రోజు నుండి పనివాడిని రోజూ కొట్టినంత పనిచేస్తున్నాను. ఏంటీ ఫుడ్, ఎలా తినాలంటూ గోల చేస్తున్నా... వాడు కూడా అక్కడ అత్యాధునిక ఒవెన్లు క్యారవాన్లో ఉన్నా కరెంటు లేక, సరైన వసతులు లేక చేయలేకపోతున్నాడు. నేను తినలేక వదిలేసిన ఫుడ్ కోసం బోజన సమయానికి పదుల్లో పిల్లలు వచ్చి చేరుతున్నారు. దీన్ని నేను పనిలో ఉండి గమనించలేకపోయాను.

           ఇంకో రెండ్రోజుల్లో వెల్లిపోతామనగా ఎప్పట్లాగే క్యారేజీ తీసుకొని వచ్చాడు, ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే యదాలాపంగా ప్లేట్ గిరాటేసి అరిచేసాను, భయం, భయంగా వాడు వెల్లిపోయాడు, అదే కోపంతో బయటకొచ్చి చెట్టు కింద నిలబడి ఫోన్ సిగ్నల్ కోసం వెతుకుతున్నాను. కాసేపయ్యాక అటు వైపు చూసేసరికి ఐదారుగురు పిల్లలు అక్కడి బండరాళ్లపై కూర్చొని, నేను విసిరేసిన పుడ్ ని ఆకుల్లో ఏరి, అపురూపంగా తింటున్న దృశ్యం కనిపించింది. దాంతో పాటు వాళ్ల నానమ్మలు కావచ్చు వాళ్లు కూడా ప్రేమగా పిల్లలకు తినిపిస్తూ, తామూ ఒక బుక్క పెట్టుకొని ఎంతో మురిసిపోతున్నారు. వాళ్ల డొక్కలు ఎండిపోయినట్టుగా ఉన్నాయి, ఆ ఆహారం తింటుంటే మాత్రం వాళ్ల మొహల్లో ఎంతో ఆనందం కనిపిస్తున్నట్టనిపించింది.

           అంత బాగుందా అని వాళ్లతో పాటు నేనూ కూర్చొని, రెండు బుక్కలు నోట్లో వేసుకున్నాను, ఆ కల్మషం లేని మనుషులతో మాటల్లో పడి నేనూ కడుపునిండా తిన్నాను. అదేంటో నిజంగానే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది.

-మీ సుధీర్ గంగాడి.

               

16, డిసెంబర్ 2024, సోమవారం

#SGdailyStories @2న్యాయం

 


#SGdailyStories @2న్యాయం

           ‘జరగండి జరగండి జరగండి’ అని నెట్టేసుకుంటూ ఒకర్ని మించి ఒకరు తోసుకుంటూ పరుగెడుతున్నారు, ఆ హడావుడికి బయపడి చెట్టు చాటుకు వచ్చి నిల్చున్నాడు మల్లయ్య. కొంత హడావుడి సద్దుమణిగాక ఏమైందోనని అక్కడున్న లాయర్ని భయం భయంగానే అడిగాడు. మొదట కసరుకున్నా... ఫీజు తీసుకుంటుంది గుర్తొచ్చి మల్లయ్య మొఖంలో ఉన్న కుతూహలం గమనించి ‘ఏం లేదయ్యా... ఆయనో పెద్ద హీరో మొన్నోకాడ సినిమా చూన్నీకి బోతే ఇగో ఇప్పుడు గాలే... గట్ల జనాలు ఎగబడితే ఒకామె సచ్చిపోయ్యిందీ, గందుకే గియ్యాల కోర్టుకు తెచ్చిండ్రు’ అన్నాడు. ‘అయ్యో... సచ్చిపొయ్యిందా... పాపం’ అని కాసేపు ఆగి.

           లాయర్ను బతిమిలాడినట్టుగా... ‘నా కొడుకును ఇయ్యాల ఇడ్సిపెడ్తరా... అయ్యా...’ అని ఆశగా అడిగాడు. ఆమాటల్ని పట్టించుకోకుండానే లాయర్ కూడా హీరోని చూడడానికి పరుగెత్తుకుంటూ వెల్లాడు. పక్కనే ఉన్న గుమస్తా కల్పించుకొని ‘ఏం కేసయ్యా నీది ఎప్పుడూ గీడ జూల్లే’ అడిగిన మాటలకు సమాదానంగా ఆకాశం వంక దీనంగా చూస్తూ చెమ్మగిల్లిన కండ్లను తుడుచుకుంటూ సమాదానం చెప్పడం మొదలెట్టాడు మల్లయ్య.

           ’మాది ఆసిఫాబాద్ దగ్గర గోండు గూడెమండీ... నాకొడుకు అందరిలెక్క గింత వ్యవసాయం చేస్తూ కొంత సర్కారోళ్ల భూమిని పోడు జేసిండని ఏడాదికింద జైళ్ల పెట్టిండ్రు సారూ...మూణ్నెళ్లకోసారి ఆన్ని ఇడుత్తరని చెప్తే పైసా పైసా పోగేసుకొని ఈ కోర్టోనికి గడ్తున్న సారు. ఈడికి ఐదారు సార్లాయే మొదట మా జిల్లా కోర్టుకాడకి బోయిన ఇగో గిప్పుడు గీ పట్నంకు రమ్మన్నారు సారు’ మాట్లాడుతుండగానే... లాయర్ తిరిగొచ్చిండు.

           ‘ఏం చెప్తుండ్రా... పోడు చేస్తే ఖైదు చెసిండ్రనా... ముచ్చట అదే కావచ్చు కానీ కేసు నక్సలైట్ ది, ఏడాదినుంచి రిమాండ్లోనే ఉన్నడు’ అన్నడు. వెంటనే మల్లయ్య కల్పించుకొని ‘ఆ పొద్దు ఊళ్లకు అన్నలొస్తే అందరిలెక్క ఆడున్నడు గంతే సారు’ అని చెప్తుండగానే మల్లీ కోలాహలం, హీరోకు బెయిలొచ్చిందని. వెంటనే మల్లయ్య ‘నా కొడుకును గూడ ఇడిసేత్తరా సారు’ అన్నాడు. ‘ఏంది ఇడిసేది, మూణ్నెళ్లు కేసు వాయిదా వేసిండ్రు, ఇందాక కోర్టులకు పొయి ఆ పేపర్లే తెచ్చిన’ అని వాయిదా పేపర్లు చేతిలో పెట్టి నిట్టూర్చాడు లాయర్. ‘జనం ఎగవడనీకి గీయనే కారణమన్నా ఇడ్సిర్సు, ఉత్తగా ఎదురొచ్చినోన్ని చూసినందుకు నాకొడుకును లోపలేసిండ్రు. నా దగ్గర పైసల్లేవు, ఆళ్లతాన ఉన్నయ్, గందుకే నాకొడుకు లోపల్నే ఉండు. ఇంకెన్నేండ్లు ఉంటడో... ఏం నాయమయ్యా...’ అని బాధతో గుణుక్కుంటూ బస్టాండ్ దిక్కు తోవ్వపట్టిండు మల్లయ్య.

         - Sudheer Gangadi

 

13, డిసెంబర్ 2024, శుక్రవారం

#SGdailyStories @1కర్మ

 #SGdailyStories @1కర్మ

ఎడతెరిపిలేకుండా వస్తున్న దగ్గు ఎంతకూ తగ్గడం లేదు, వంట్లో రోగానికి అతి శీతల చలిగాలులు కూడా తోడై ప్రాణాన్ని ఉపిరితిత్తుల గుండా బయటకు పంపేలా ఉంది. దీనికి తోడు కరోనా అనంతరం టీబీలాంటి బయంకరమైందేదో గాలి ద్వారా వ్యాపిస్తుందని టీవీలు ఒకటే ఊదరగొడ్తున్నాయి. అప్పట్నుండి ఇంట్లో ఓ మూలకు ఉన్న నా మంచం గ్యారేజీలో మూలకు చేరింది. లక్షలకు కోట్లు సంపాదించాను.
కోడళ్లు గంజి పోయరేమోనని చివరి వయసులో తోడుండాలనుకొని రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాను, అమెరికా కొడుకు, ఆస్ట్రేలియా కొడుకు కట్టెకాల్చడానికి కూడా రారేమోనని ఆస్థికలు గంగలో కలిపిన నాడే ఆస్థిమీద హక్కులు దక్కుతాయని విల్లుకూడా రాసాను. అదే ఇప్పుడు మెడకు ఉరితాడులా చుట్టుకుంది, దాన్ని చూసి ఆస్థి లేకపోతే ఈ ముసలి పీనుగు నాకెందుకు అనుకొని అందిన కాడికి దండుకొని వదిలిపోయింది నా ముసలి పెల్లాం, అబ్రాడ్లో ఎంత సంపాదించినా అత్త, మామల ఆస్థిని ఎలా వదిలేస్తామని ఇంట్లో వాలిపోయారు ఇద్దరు కోడళ్లు కొడుకులతో కలిసి.
ఉప్పడిదో... చప్పటిదో... ఓల్డ్ ఏజ్ హోంలో పెట్టిందేదో తింటూ బాగానే గడిచింది, కన్నపేగు అనే బందాన్ని తిరిగి విల్లుతో తెచ్చుకుంటే... వచ్చిన మూడ్నెళ్ల నుండి నేనెప్పుడు పోతానా అన్నట్టు చూస్తున్నారు. ఇప్పట్లో పోనేమోనని విసుగొచ్చి గ్యారేజీలోకి తోసేసారు.
‘ఓరేయ్ రాము కాసిన్ని మంచినీళ్లివ్వరా’ అనే నా ఐదోసారి అరుపులకు విసుక్కుంటూ వచ్చి, ‘అక్కడే ఉన్నాయ్ తాగొచ్చు కదా నాన్నా’ అని కసిరాడు.
‘ఇంత సంపాదించింది మీకే గదరా... కొంచెం మనిషిలా చూడండ్రా...’ దీనంగా అడుక్కున్నాను.‘
హా... సంపాదించావులే... తాత ఇచ్చిన దాన్ని కాపాడావు అంతేగదా...’ ‘ఐనా నువ్వు తాతను దొడ్లో గొడ్ల పక్కన పడేశావుగా... నేనలా చేసానా... ఇక్కడ బెడ్డు మీదే ఉంచానుగా’ అని విసుక్కుంటూ వెల్లిపోయాడు.
అప్పుడు గుర్తొచ్చింది మా నాన్నను నేనెలా చూసానో... యవ్వనం ఇచ్చిన మత్తు, పెళ్లాం మాటల కిక్కుతో ఇంకా ఎప్పుడు చస్తావ్ అని రోజూ అంటూనే ఉండేవాడిని. ఇలా చీదరింపులు, కడుపు మాడ్చడాలు అబ్బో చెప్పడానికి సిగ్గుపడే పనులే అన్నీ... రోజంతా అవే జ్ణాపకాలు, చావు కోసం ప్రార్థిస్తూ... పక్కమీద దొర్లుతూ... ఆయన పడ్డ ఇబ్బందులన్నీ గుర్తొచ్చి కళ్లలోంచి దారలా నీల్లు కారుతూనే ఉన్నాయి.
చీకట్లు ముసురుకుంటుంటే పెరగాల్సిన దగ్గు తగ్గిపోయింది. ఎందుకంటే నాడు నాన్నకు నేను చేసిన మర్యాదలు తల్చుకొని నేడు గొంతు బిగదీసుకుపోయింది. మెల్లిగా క్షమాపణలు చెప్పుకుంటూ శ్వాస కూడా... చూసారా చివరికి చావును సైతం శాంతంగా ఇవ్వగలిగింది కేవలం తల్లిదండ్రులే.
- Sudheer Gangadi

No photo description available.
All reactions:
Shiva Aala and 2 others

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

7, ఫిబ్రవరి 2022, సోమవారం

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు గారి అభినందనలు



మన ‘ఇగురం’ పుస్తకం గురించి సీఎం కేసీఆర్ గారు స్వయంగా తెలుసుకొని అభినందించిన సందర్భం మరిచిపోలేనిది.

మరిచిపోలేని రోజు
27 వ తారీఖు, గురువారం
‘ఇగురం’ పుస్తకం విడుదలై సరిగ్గా నెల దాటింది.
కిటికీల, దర్వాజల సందుల్లోంచి దూసుకొస్తున్న శీతల గాలులు ముప్పిరిగొని, నిద్రలేవకుండా బద్దకించేలా చేస్తున్నాయి. ఇంతలో ఎనిమిదైతుంది అన్న రేవతి పిలుపుతో తప్పనిసరిగా లేచి త్వరత్వరగా రెడీ అయ్యాను.
ఉదయం 8.30 - 9 మద్య ఇంట్లోంచి మామూలుగానే ఆఫీసుకు బయల్దేరాను,
‘ఇగురం’ పుస్తకాల కాపీలు ఎక్కువగా లేకపోవడం, కరోనా ఎక్కువైతుందనే వార్తలతో ఇవాళ ఎవర్నీ కలువలేను అనుకొని ఇగురాన్ని చేతుల్లోకి తీసుకోలేదు,
బండి స్టార్టు చేసి వెల్తూ వెల్తూ ఉండగా ఆఫీసుకు దగ్గర్లో ఉన్నప్పుడు పోన్ రింగవడంతో అటెండ్ చేసాను, మల్లీ జేబులో సెల్లుని పెట్టేటప్పుడు నొటిఫికేషన్లో వాట్సాప్ న్యూ మెసెజీ సింబల్ కన్పించడంతో యదాలాపంగా వాట్సప్ తెరిచాను.
అందులో మెసెజి మినిస్టర్ గంగుల కమలాకర్ గారు హైదరాబాద్ వచ్చారు అని.
వెంటనే బండి రూట్ మార్చి మినిస్టర్ క్వార్టర్సుకు చేరుకున్నాను.
ఆపీసంతా సందడి సందడిగా ఉంది, రెగ్యులర్గా నా పనుల్లో నేను ఉండిపోయాను.
లంచ్ ముగిసిన వెంటనే ప్రగతిభవన్కి వెల్లాలి, సిద్దంగా ఉండండి అని అలర్ట్.
కేటీఆర్ గారితో మీటింగ్ ఉందని తెలియడంతో...
వెంటనే లంచ్ చేసేసి సిద్దమైపోయాను.
సరిగ్గా 3.30 గంటలకు ప్రగతి భవన్కి చేరుకున్నాము,
కరోనా జాగ్రత్తలతో మినిస్టర్ గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ నూతన అధ్యక్షుడు శ్రీ జీవి రామకృష్ణారావు గారు మరికొంత మందితో సీఎంవో ఆపీసులోకి చేరుకున్నాం.
అక్కడికెల్లాక తెలిసింది ఈ రోజే సీఎం గారిని కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడితో పాటు మరికొంత మంది మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు అని,
అప్పుడనిపించింది అయ్యో.... ఇవాలే ‘ఇగురం’ పుస్తకాన్ని తీసుకురాలేదే.... ఒకవేళ అవకాశం వస్తే సీఎం గారికి ఇచ్చేవాడినే... అని కొంచెం నిరాశ జనించింది. అలా అక్కడ నిలబడి ఉండగానే,
పదినిమిషాల తర్వాత మినిస్టర్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, ఒడితెల సతీష్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గార్లకు సీఎం గారి నుండి పిలుపు రావడంతో వారు మాత్రమే సీఎం నివాసంలోకి వెల్లారు.
వెంటవెల్లిన నాతో పాటు మిగిలిన వాళ్లను వేయిటింగ్ రూంలో కూర్చోబెట్టారు.
అయ్యో... ఇక ఈ రోజుకు సీఎం గారిని కలిసే అవకాశం మాకు లేదేమో అనుకొన్నాను, ఇంతలోనే పుస్తకం కూడా లేదు కదా అని అనిపించింది,
అక్కడ ఉన్న పత్రికలు తిరగేస్తున్నాను.
అరగంట తర్వాత సీఎంవో సిబ్బంది వచ్చి మినిస్టర్ గంగుల కమలాకర్ గారికి సంబందించిన వారిని రమ్మంటున్నారు అనడంతో అందరం అటు వైపు వెల్లాం.
సెక్యూరిటీ చెకింగ్స్ పూర్తి చేసుకొని లిప్ట్ ద్వారా మెదటి అంతస్థుకు చేరుకున్నాం.
అప్పటికే చాలా జిల్లాలకు సంబందించిన వారు ఒక్కొక్కరుగా అక్కడ వెయిట్ చేస్తున్నారు.
మినిస్టర్ గంగుల కమలాకర్ గారు మమ్మల్ని తీసుకొని నేరుగా సీఎం గారు ఉన్న రూంలోకి వెళ్లారు.
తెల్లటి చొక్క, పంచె కట్టు కొని అక్కడికొచ్చిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఒక్కొక్కరితో యోగక్షేమాలు విచారిస్తూ వారిని మాట్లాడిస్తూ అధ్యక్షులను సన్మానిస్తూ పోటోలు దిగుతున్నారు సీఎం కేసీఆర్ గారు.
ఆ రూపం చూసిన నాకు తన్మయత్వంగా అనిపించింది, ప్రసన్న వదనంతో ఉన్న కేసీఆర్ గారిని చూస్తూ...
గతంలో ఉద్యమ సమయంలో చండ్రనిప్పులు కక్కుతూ బావోద్వేగ ప్రసంగాలు ఇచ్చిన రూపాన్ని,
నిమ్స్ హాస్పిటల్ బెడ్ పై చావు అంచుల్లో సైతం మొక్కవోని దీక్షతో వెలుగిన మొఖం ఒక్కసారిగా నా కళ్లముందు కదలాడాయి.
సీఎం కేసీఆర్ గారిని ఉద్యమంలో, టీవీల్లో, ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లలో, సభల్లో ఎన్నోసార్లు చూసినప్పటికీ అంత దగ్గరగా చూడడం మొదటి సారి కావడంతో నాలో నాకు తెలియకుండానే ఒకరకమైన ఉద్వేగం కలుగుతుంది.
విశాలమైన హాళ్లో మూడు వైపులా పొందికగా అమర్చిన సోపాలు, మద్యలో విశాలమైన టీపాయ్, ఒకవైపున సీఎం కేసీఆర్ గారు నిల్చొన్నారు, హాళ్లోకి వెల్లిన వారు సోఫాల వెనుకగుండా తిరిగి సీఎం గారి పక్కన వరుసగా నిల్చుని ఆయన్ని కలువడానికి ముందుకు కదులుతున్నారు.
దాదాపు అన్ని జిల్లాలకు చెందిన మంత్రులు ఆయా జిల్లాల నూతన అధ్యక్షులతో కలిసి కేసీఆర్ గారిని కలుస్తున్నారు. సీఎం గారు వచ్చిన వారిని మందలిస్తూనే, వారితో పోటోలు దిగుతూ అక్కడే ఉన్న మంత్రులు ఇతర ఉన్నతాధికారులతో కొన్ని అధికారిక అంశాలపై సూచనలు చేస్తున్నారు.
ఇంతలో మంత్రి గంగుల కమలాకర్ గారితో కలిసి మేం పదిమందిమి సీఎం గారితో పోటో దిగడానికి ముందుకు అడుగేసాం.
ఒక్కొక్కరిని మా మంత్రిగారు కేసీఆర్ గారికి పరిచయం చేస్తున్నారు. సీఎం గారు వారిని నవ్వుతూ రిషీవ్ చేసుకుంటూ వారి యోగక్షేమాలు విచారిస్తూనే మద్య మద్యలో అధికారులకు, మంత్రులకు సూచనలు చేస్తున్నారు.
ఇలా సీఎం గారికి దగ్గరవుతున్న ఒక్కో క్షణం నాలో ఉద్విగ్నత మరింతగా పెరుగుతుంది, ఏమని మాట్లాడాలి, అసలు సీఎం గారితో మాట్లాడే అవకాశం ఉంటుందా...
లేకున్నా సరే....,
కనీసం ఆయనతో ఫోటో దిగినా చాలు నా జన్మ ధన్యం
దానికి తోడు ఇప్పటికే వేయి బుక్కులు అయిపోయి మలి ముద్రణలో ఉన్న ఇగురంకు మరింత బూస్టప్ దొరుకుతుంది...
అయ్యే... ఇవాలే బుక్ నా చేతిలో లేదే...
అని ఇలా పరిపరివిదాల ఆలోచిస్తుంది మనసు.
అనుకున్న గడియ రానే వచ్చింది.
సీఎం గారికి నమస్కరిస్తూ ముందుకు అడుగేసాను, కేసీఆర్ గారు నా వైపు తిరిగి నవ్వుతూ నమస్కరించారు.
ఆ చూపు నేరుగా నను తాకే సరికి నా ఉద్వేగం తారా స్థాయికి చేరింది. సార్ నన్ను చూసారు చాలు అని సంబరపడ్డాను. అదే క్షణంలో పోటో సరిగా రాదేమో అనే బెంగ మనుసులోకిచ్చింది, ఎందుకంటే సీఎంగారు నన్ను చూసి నమస్కారం పెట్టిన సమయంలో అతని పక్కన మా ఇద్దరి మద్యలో కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన పక్కకి జరగ్గానే కేసీఆర్ గారి పక్కనే నిల్చొని పోటోకి ఫోజివ్వాలనుకున్నాను.
ఇదంతా క్షణ కాలంలో జరిగిపోతుంది, కానీ నేను ఆ సువర్ణ క్షణాలను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను కాబట్టి అక్కడే కాలం ఆగిపోయిందేమో అనిపించింది. చాలా సంతోషంగా ఉంది.
ఇంతలో మద్యలో వ్యక్తి జరగడంతో సీఎం గారి పక్కకి వెల్లి నిలుచున్నాను, మంత్రి గంగుల గారు నన్ను పరిచయం చేసారు. సీఎం గారు మరొక్కసారి నన్ను చూసి విష్ చేస్తూనే మంత్రి సభిత గారికి ఏదో సూచిస్తున్నారు. ఆక్షణం చాలా సంతోషంగా అనిపించింది.
అంతలోనే అబ్బా.....
సబిత గారితో సారు ఇప్పుడే మాట్లాడాలా....
ఇంకోసారి నన్ను కనులారా కేసీఆర్ గారు చూస్తే బాగుండు అనుకుంటున్నాను...
ఇంతలో వేరే వాళ్లు పోటో దిగడం కోసం ముందుకొస్తున్నారు.
ఇక గత్యంతరం లేదు సీఎం గారికి ఎడంగా దూరంగా జరగాల్సిన సమయమొచ్చింది.
తొలిసారిగా... నాకు అంత సంతోషాన్నిచ్చిన ఆ కాలంపై ఇంకాసేపు ఇక్కడే కాలం ఆగిపోతే బాగుండు అని
కోపం వచ్చింది.
కానీ మనకు అనుకూలంగా అన్ని జరిగితే అది కాలం ఎలా అవుతుంది అనుకొంటూ తప్పనిసరి పరిస్థితుల్లో బారంగా వెనుకడుగు వేయడానికి నా ఎడమ కాలిని వెనుకకు జరిపాను,
కానీ నా కాళ్ల మద్య సమన్వయం లోపించింది, వెనుకకు వెసిన ఎడమ కాలికి కుడి కాలు సహకరించడం లేదు, వెనుకకు రావడానికి మొరాయిస్తుంది. నిజానికి అక్కడ వెల్లండి అని చెప్పేవాళ్లు ఎవరూ లేరు, గన్ మెన్లు కాని, వ్యక్తిగత సిబ్బంది కానీ ఎవరికి అలా సూచించడం కూడా లేదు, కానీ అప్రయత్నంగానే అందరూ సీఎం గారి విలువైన కాలానికి బందీల్లా... సుశిక్షుతులైన సైనికుల్లా... వచ్చిన తమ పనిని ముగించుకొని నిబద్దతతో కూడిన క్రమశిక్షణతో వెల్లిపోతున్నారు.
సీఎంగారు నన్ను కండ్లతోనే విష్ చేసి పోటో వైపు చూసి మల్లీ అటు తిరిగి మంత్రి సబిత గారితో ఏదో మాట్లాడుతున్నారు.
మరో వ్యక్తి సార్ తో పోటో దిగడానికి ముందుకు వస్తున్నారు...
ఇక నేను కూడా ఏం చేయలేను, సార్ సమయాన్ని గౌరవించాల్సిందే అనుకొని కుడికాలును కూడా వెనక్కి తీసుకోబోతున్నాను.
అప్పుడు జరిగింది...
నా జీవితంలో మహాద్బుత ఘట్టం, నేనూహించని పరిణామం,
వెనక్కి వెళ్లబోతున్న నా వైపు చేయి చాపుతూ కేసీఆర్ గారు ఒక్కసారిగా
‘ఇగురం రైటర్ కదా మీరు’ అన్నాడు...
అంతే వెనక్కి వెల్లబోతున్న నేను అక్కడే స్థానువులా నిల్చుండిపోయాను,
ఒక్కసారి నేను విన్నది కరక్టేనా అని అనుమానం కలిగింది,
షాక్ కొట్టినట్టుగా శరీరమంతా వేల వాట్ల విద్యుత్ ప్రవాహం పరుగులెట్టింది.
ఇలా నా పరిస్థితి ఒక అనిర్వచనీయమైన ఆనందంలో ఉంటే....
అప్పటివరకూ అక్కడే ఉన్న దాదాపు పది మంది మంత్రులు, ఇరవై మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంతో మంది విఐపీలు అంతా సీఎంగారు మందలించిన ఈ వ్యక్తి ఎవరూ అంటూ ఒక్కసారిగా నా వైపు చూపు దాల్చారు...
ముందుకు రాబోతున్న మరో వ్యక్తి టక్కున ఆగి వెనక్కి వెల్లారు.
తేరుకున్న నేను
‘స...ర్... స ర్... సర్... మీకు ఇగురం గురించి తెలిసిందా....
మీ వరకూ పుస్తకం చేరిందా...... ధన్యున్ని సర్....’
అని తడబడుతూ..... నాకు తెలియకుండానే పరవశంతో మాట్లాడాను.
అప్పటికే కేసీఆర్ గారు చాచిన చేయి నా భుజాన్ని తాకి తనవైపు లాక్కుంటుంది. నా ఒళ్లు నా అదుపులో లేదు, జీవితంలో ఎన్నడూ చూడని, అనుభవించని అనుభూతికి లోనవుతుంది శరీరం.
ఇంతలో సీఎం గారు మల్లీ
‘నేను విన్ననయ్యా... చదివానయ్యా ఇగురం పుస్తకాన్ని’ అని అన్నారు‘
అప్పటికే సారుకు అతి దగ్గరగా ఉండడంతో మరింత ఆశ్చర్యంతో...
’సర్ మీరు చదివారా..... మీ దాక ఇగురం పుస్తకం చేరిందా’ అని అన్నాను.
వెంటనే కేసీఆర్ గారు ‘నా బుక్కు ఏది’ అంటూ చేయి చాచి అడిగారు....
ఒక్క క్షణం
అయ్యొ.... కాలం ఎంత కక్ష కట్టింది నాపై...
రోజు పదుల సంఖ్యలో ‘ఇగురం’ బుక్కులు చేతపట్టుకొని తిరిగే నేను, ఇవాల కనీసం ఒక్క పుస్తకం లేకుండా రావడమేంటి అని నన్ను నేనే తిట్టుకున్నాను.
కేసీఆర్ గారు అలా అడిగే సరికి ఊహించని నేను, ఏం సమాదానం చెప్పాల అని తటపటాయించాను,
ఇంతలో మంత్రి గంగుల కమలాకర్ గారు కల్పించుకొని
‘సార్, సుధీర్ పీఆర్వోగా పనిచేస్తున్నాడు, అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు సర్, బుక్ తీసుకురాలేకపోయాడు’ అని అన్నాడు
వెంటనే నేను కూడా...
‘సర్ మిమ్మల్ని కలిసే అవకాశం ఇవాల వస్తుందని అనుకోలేదు సర్, బుక్ వెంటలేదు’ అన్నాను.
వెంటనే సర్ మంత్రి గంగుల గారి వైపు తిరిగి ‘పర్లేదు’ అంటూనే నా వైపు తిరిగారు దగ్గరికి తీసుకొని బుజంపై చేయితీసి పోటోగ్రాఫర్ వైపు చూసారు,
అహా ఏదో ఫోటో దొరుకుతుంది అనుకున్నా... అలాంటిది అధ్బుతమైన ఫోటో రాబోతుంది అని సంబరంతో పోటో దిగడం అవగానే వెనక్కి రాబోతున్న నాతో
‘ఇగురం పుస్తకం చాలా బాగుంది’
‘అధ్బుతంగా రాస్తున్నావు’
‘కీప్ రైటింగ్’
‘రాయడం వదలొద్దు’
అన్నారు సీఎం కేసీఆర్ గారు
‘థాంక్యూ సర్, మొదటి పుస్తకానికే మీ ఆశీర్వాదం దొరకడం నా అదృష్టం సర్’ అని వెనక్కి అడుగేసాను.
కళ్లతోనే ఆల్ ద బెస్ట్ అన్నట్టుగా చూస్తూ మరొకరిని అంతే ఆప్యాయంగా విష్ చేసారు సీఎం కేసీఆర్ గారు.
అంతే అక్కడినుండి వెనక్కి వచ్చేసి, ఆ రూం బయటకొచ్చిన తర్వాత
మా మంత్రి గారితో పాటు, నా చుట్టూ ఉన్నవాళ్లు మరోసారి నన్ను అభినందించారు.
కానీ నేను ఇంకా ఆ తన్మయత్వపు షాకులోనే ఉన్నాను. వాళ్లు అంటుంది వింటూనే అసలు ఇది కలా.... నిజమా.... అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను.
అసలు ఇవాల బుక్ తీసుకురావా.... అన్నారు. మరికొంత మంది ఏం బుక్ రాసావు, అది ఎక్కడ దొరుకుద్ది, సీఎం గారే బాగుంది అన్నారంటే ఆ బుక్ చదవాల్సిందే అంటున్నారు... అలా
సీఎం కేసీఆర్ గారు ఎందుకు ప్రత్యేకమో చర్చించారు. కనీసం ఒక్కసారి చూడకపోయినా... కేవలం ఒక బుక్కు మాత్రమే రాసిన గంగాడి సుధీర్ లాంటి వాళ్ల పుస్తకాన్ని సైతం నెల రోజుల వ్యవదిలోనే ఇంత పరిశీలించారు, పరిశీలించడమే కాదు సిరిసిల్లకు చెందిన అతను వేరేవాళ్లతో వచ్చినప్పటికీ గుర్తుపెట్టుకొని పుస్తకం గురించి మాట్లాడారంటే సామన్య విధ్వత్తు కాదు అన్నారు.
నాకు కూడా ఇన్ని రోజులు కేసీఆర్ గారి గురించి చాలా గొప్పగా విన్నాను....
ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత నేను విన్నది చాలా తక్కువనే అనిపించింది.
జనభాహుళ్యంలోకి వెల్లిన పుస్తకాన్ని తెప్పించుకొని చదివడమే కాకుండా, పుస్తకంలోనో, పేపర్లోనో, పెస్బుక్లోనో... ఎక్కడో చూసిన నాలాంటి ఒక సామాన్య రచయిత తన ముందుకొచ్చి నిలబడ్డప్పుడు, వందల మంది పక్కనే ఉన్నా... అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నా... తొలిసారి ఆ వ్యక్తిని చూస్తున్నా.... పోల్చుకొని గుర్తుబట్టడమే కాకుండా.... పేరు పెట్టి పలకరించడం సామాన్య విషయం కాదు, తన రచనల్లోని గొప్పతనాన్ని కాపాడుకొమ్మని ఆశీర్వదించడం అందరికీ సాధ్యం కాదు.
అందుకే ఆయన కేసీఆర్, తెలంగాణ నిరంతరం గుర్తుపెట్టుకొనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,
రాఘవరావు, వెంకటమ్మలు కన్న కారణ జన్ముడు.
తెలంగాణ తల్లి దాస్యశృంఖలాలు తెంపిన పోరాట యోదుడు
జన్మభూమిని సస్యశ్యామలం చేస్తున్న నిత్య కృషీ వలుడు.
జై కేసీఆర్
జయహో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
(ఈరోజును మర్చిపోలేకుండా మార్చిన, కేసీఆర్ గారిని కలిపించిన గంగుల కమలాకర్ గారికి నా ఆజన్మాంతం రుణపడే ఉంటాను)
మీ గంగాడి సుధీర్
ఈ ‘ఇగురం’ కథా సంపుటి కొనడానికి
Order your copy now
Or 160Rs/- GPAY/PPAY to 9394486053 with full adress.


 

3, నవంబర్ 2021, బుధవారం

గెలుపు ఈటెలదా....? బీజేపీదా...?

 

వ్యక్తి ఎవరైన సరే, వ్యవస్థ ముఖ్యం ఇది బారతీయ జనతా పార్టీ చెప్పుకొనే మౌళిక సూత్రం, సిద్దాంత ఫరంగా జై శ్రీరామ్, హరేక్రుష్ణ అంటూ ఒకరిద్దరు దేవుళ్లని ప్రభలంగా వినిపిస్తూ హైందవమే మా నినాదం అని బహిరంగంగా చెప్పుకొనే పార్టీ, నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ నుండి నేటి జే.పి. నడ్డా వరకూ సామాన్యులే మా పార్టీ రథ సారధులు అని చెప్పే పార్టీ, ఒకప్పుడు ఆర్ఎస్ఎస్లో దాని అనుబంద సంస్థల్లో పనిచేసిన వారికే పెద్ద పీట వేసిన పార్టీ, నిన్నటి ఉప ఎన్నికల్లో హుజురాబాద్లో విజయం సాధించింది, ఐతే ఈ గెలుపుకు అభినందించాల్సింది బీజేపీనా....? లేక అక్కడ పోటీ చేసి గెలిచిన ఈటెలనా....? సామాన్యుల మదిని తొలుస్తున్న ఈ ప్రశ్నకు సమాదానం మాత్రం బీజేపీ నాయకత్వానికే ఎక్కువ అవసరం, ఈ ఉప ఎన్నికలకు బీజం పడ్డది ఈటెల రాజేందర్ మంత్రివర్గంనుండి భర్తరఫ్ అయిన తర్వాత, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత, అప్పుడు ఈటెల ఉన్నాడు, బీజేపీ లేదు. తదనంతరం ఈటెల కొంతకాలం వరకూ ఒంటరిగానే ఉన్నాడు అప్పుడూ బీజేపీ లేదు, ఇక తర్జనభర్జనల అనంతరం బీజేపీ గూటికి చేరాడు, కానీ అప్పటి నుండి ప్రచారం ముగిసేంతవరకూ పేరున్న బీజేపీ జాతీయ నాయకులెవరూ హుజురాబాద్ వైపు చూడలేదు, ఈ రసవత్తర పోరు సాగుతున్నప్పుడే నిర్మల్కి వచ్చిన అమిత్ షా, హుజురాబాద్ మీదుగానైనా పోలేదు, తమ పార్టీ నినాదమైన జై శ్రీరాం అన్న మాటని ఒక్కసారి పలుకకుండా హుజురాబాద్లో ఈటెల గెలిచాడు, పార్టీ ముఖ్య నేతలెవరూ మీదేసుకొని  ప్రచారం చేసిన దాఖలాలు లేవు, పార్టీ ప్రచార వ్యూహాల్లో ఎప్పుడూ ఉండే మతం అన్న అంశం వినబడలేదు, పోనీ కేంద్ర ప్రభుత్వ విదానాల గురించి చర్చ జరగలేదు, పదే పదే టీఆర్ఎస్, కాంగ్రెస్ కు సంబందించిన నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతూ హుజురాబాద్ కోసం ఏం చేస్తారు, రైతు వ్యతిరేక చట్టాలపై ఏమంటారు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల్ని ఎలా వెనకేసుకొస్తారు అని బీజేపీని లాగే ప్రయత్నం చేసినా, ఈటెల చాక చక్యంగా ఆ ఊబీలోకి వెల్లలేదు, పార్టీ అనేది జెండా ఎగరడానికి ఊతంగా ఉండే ఊతకర్రే అన్న మాదిరిగా ఏనాడు పార్టీ గురించి చెప్పలేదు, ఓటేయాల్సిన సింబల్గానే కమలం పువ్వు గురించి చెప్పారు. ఇవన్నీ ఎవరు ఔనన్నా... కాదన్నా.... అక్కడ ప్రచారం చేసిన బీజేపీ శ్రేణులకు తెలుసు, ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు. ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంతో పాటు సింహబాగం 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీని సైతం ఉప ప్రాంతీయ పార్టీ అని సంబోదిస్తున్న పార్టీ  ఇవాల ఒక ఉపఎన్నిక కోసం పార్టీనే పక్కన పెట్టి మన గుర్తు గెలిస్తే చాలు అని అనుకొన్నదా....? ఈ ప్రశ్నకు సమాదానం బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. నిజానికి ఈ దశకు బీజేపీ వచ్చి చాలా రోజులే అయింది. 2014లో మోడీని తెరపైకి తెచ్చినప్పుడే అన్ని పార్టీల మాదిరే బీజేపీ సైతం వ్యక్తిపూజకు ఆస్కారం ఇచ్చింది. అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికల్లో గెలుపు క్రెడిట్ని పార్టీకన్నా ఎక్కువగా మోడి-షా ద్వయానికే అంటగట్టి వ్యక్తిపూజలోకి మెల్లమెల్లగా ఆ పార్టీ క్యాడర్ని సైతం దించింది. ఇప్పుడు వారికి కావాల్సింది పార్టీ గెలుపా, సింబల్ గెలుపా అనేది ముఖ్యం కానే కాదు. అధికారం. ఎస్ అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్నీ వాడుకోవడం, ఇదే బీజేపీ నయా వ్యూహం, బయటకు మాకొక్కరికే సిద్దాంత భావజాలం ఉందని చెప్పుకున్నా, అధికారం కోసం సిద్దాంతాన్ని పక్కన పెట్టడానికి ఏమాత్రం ఆలోచించరని వారిని నిశితంగా గమనిస్తున్న వారికి అవగతమౌతుంది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో లోక్ సబ స్థానాన్ని కోల్పోయింది, పశ్చిమ బెంగాల్ సహా ఇతర చోట్ల అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ తీవ్రమైన ప్రతికూల గాలి వీచింది 30 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 7 మాత్రమే గెలిచింది, ఇలా ఉత్తరాదిని కోల్పోతున్న సంధీ దశలో ఎలాగైనా దక్షణాదిలో పాగా వేయాలి, 2024 ను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం ఇంతకుమించిన వ్యూహం బీజేపీకి కనబడట్లేదు, అందుకే పార్టీ అధికారంలోకి రావడానికి మార్గాల్ని వెతకడమే తక్షణ కర్తవ్యం, అందుకోసం ఇతర పార్టీలోంచి వచ్చే వ్యక్తుల్ని అందలమెక్కించడానికి, అవసరమైతే వ్యక్తి పూజ చేయడానికి సైతం బీజేపీ వెనుకాడడం లేదు. కానీ భలమైన నాయకత్వం తమ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతే, తెలంగాణలాంటి ప్రాంతాల్లో మౌళిక సిద్దాంతం ఆదారంగా ఏళ్లకేళ్లుగా పనిచేస్తున్న వారికి పార్టీలో ప్రాదాన్యం సంగతి దేవుడెరుగు ప్రాతినిధ్యం లేని పరిస్థితులు వస్తాయి. అప్పుడు పార్టీనా....? వ్యక్తా....? అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. వీటికి సమాదానం ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే అవుతుంది. అప్పటికైనా గెలిచింది ఈటెలా....? లేక బీజేపీనా.....? అనేది ఒక సమాదానంలా నిలుస్తుంది.