2, జనవరి 2021, శనివారం

Happy new year 2021

 జీవితకాల అనుభవాల్ని

జీవితమంతా వెతికినా దొరకని అనుభూతుల్ని

సంక్షోభంలోనూ సాగే బతుకు భారాన్ని
సంబరంలోనూ దక్కని ఆనందపుటంచుల్ని
కరోనాతో కలిపి అందించిన కాలం కరిగిపోయింది.
రేపు మంచే రావాలని కోరుకుంటూనే కదా స్వాగతిస్తాం
ఐనా... వచ్చేదేదైనా స్వాగతించే స్థైర్యం తెచ్చుకుందాం
క్యాలెండర్ రెక్కలు ఒక్కోటి రాలిపోతుంటే
డైరీలో పేజీలు సిరాక్షరితో రంగుతేలుతుంటే
మరో వత్సరం నులివెచ్చగా స్పర్శిస్తూ సమాగమిస్తోంది.
నిన్నా... నేడు.... రేపు అనుకొంటే
కేవలం అంకెలు
కేవలం రోజులు
కేవలం దారులు
నిన్నా... నేడు.... రేపు అనుకొంటే
సరికొత్త ఉషోదయ ప్రాకారాలు
ఓటమిలోంచి ఎలుగెత్తే విజయనాదాలు
ఆశలతో చిగురించే కొత్తగానాలు
అందుకే అందరికీ అనుకున్నవి జరగాలి
జరిగినవే నిను నిలబెడ్తాయి
Happy new year 2021

బాలూ... వెలిపోయావా...


 బాలూ... వెలిపోయావా...

అమృతాన్ని గళంలో నింపుకొని
గానంలోకి దాన్ని వొంపి
సరాసరి నా చెవుల్లో నింపిన ఆ గాత్రం మూగబోయిందా....
హలోగురు ప్రేమకోసమేరా....
అంటూ నా యవ్వనాన్ని చైతన్యపరిచినా...
ఏదివిలో విరిసిన పారిజాతమో...
నని నా ఊహల్లో సుందర స్వప్నాలు గిసినా...
అంతర్యామి అలసితీనంటూ....
వైరాగ్యాన్ని వో ప్రవాహంలా నాలోకి ఒంపినా...
అది నీ గాత్రానికే చెల్లింది బాలూ....
ఉత్సాహం ఆవిరై
బతుకు మీద విరక్తి వచ్చిన వేల
నీ పాట ఓ ఉత్తుంగ తరంగమై నన్ను సేదదీర్చింది
ఉషారు ఉప్పొంగి ఊరంతా ఊరేగే వేల
నీ గొంతు దాన్ని రెట్టింపు చేసింది
బాదతో ముడుచుకుపోయినప్పుడేమో
హ్రుద్యంగా నీ గొంతు పలికిన బావన ద్రవింపజేసింది
అసలు నువు మాతో లేనిదెప్పుడు
పాటల తోటలో రారాజులా
ప్రతీరోజు నీ గానం వినని తెలుగు ప్రాణం ఉండదు
సంగీతకారుని స్వరాలకి
సాహిత్యకారుని అక్షరాలకి
నీ స్వరం ప్రాణం పోసింది.
కడుపేదవాని కడగండ్లకి
కడుమిక్కిలి సంపదలిండ్లకి
ఆ గాన ప్రవాహం ఒకేరీతిన గారాలు పోయింది.
మాటలకున్న బాషల్ని
నీ గానం చెరిపేసింది
విశ్వజనీనమైన సంగీతబాషతో నీ గళం
చిరస్థాయిగా మా చెవుల్లో మార్మోగుతుంది
ఎన్నెన్ని వైరుధ్యాలు
ఎన్నెన్ని మధురసాలు
అల్లరి పిల్లవాడు మొదలు పండు ముసలి స్వరం వరకూ
నీ గళం వైవిద్యాలు పోతుంటే
వాయిద్యాలు సైతం విస్మయం పొందాయేమో
గోదారి పిల్లతెమ్మెరలను
కృష్ణమ్మ గలగలలనూ
కోకిల కంజీరవాలనూ
ఉషోదయ నులివెచ్చ కిరణాలనూ
ఒకటేమిటి సమస్త ప్రకృతి పరవశాన్ని
పాటలో పొదివిన కంఠమది
బాలూ...
నువ్వెక్కడికీ
వెల్లలేదు, వెల్లువై...
మా లోలోపలికి
మా అంతరాంతరాల్లోకి
మా హ్రుదయాంతరాల్లోకి
చొచ్చుకుపోయావు
లయబద్దమైన నీ ఉఛ్వాస నిఛ్వాసాల్లో
మా ప్రాణవాయువు ఏనాడో లీనమైంది
ఇక గరళ కంఠుని ఎదుట
అమృత కంఠుని కచ్చేరీలు మార్మోగుతుంటాయి
గంగాడి సుధీర్.
(నేను రాసిన పాట నీ గొంతులో వినాలన్న నా కోరిక తీర్చకుండానే వెలిపోయావన్న కోపం నీ మీద బాలూ....)

24, డిసెంబర్ 2020, గురువారం

రికవరి

 


రికవరి

ఎట్లా కోలుకోవాలి, ఏం చేయాలి, ఏం అర్థంకావడం లేదు, ఆలోచిస్తుంటే తల బద్దలైపోయేలా ఉంది, గత ఐదు నెలలుగా ఇదే ఆలోచన, ఏ పని చేస్తున్నా మనసు స్థిమితంగా ఉండడం లేదు, నాన్న భలవంతం మీద ఇంటర్లో చేసిన వ్యవసాయ పనులేగనక రాకపోతే ఇప్పుడు మరింత కష్టమయ్యేది, ఇక ఏదో ఒకటి తేల్చుకోవాలి నాన్చుకుంటూ పోతే అసలుకే మోసం వచ్చేలా ఉంది. ఇట్లా ఆలోచనల్లో ఉండగానే రాజు ఏంది బిడ్డా, గంత సోచాయిత్తన్నవ్, ఫా ఇంటకి రావా, పొలానికి నీళ్లు పారుతున్నయ్ గదా... అని ఈరయ్య మామ పిలిచే సరికి తేరుకొని ఆ వత్త మామ, బోదాం పా అని బండి స్టార్టు చేసిన, వెనకాలే కూర్చున్న ఈరయ్య మామ పోలం కూడా మా పొలం పక్కనే ఉంటది, ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలంనుంచి బండి మీద పోతుంటే రాజు, మళ్ల నీ నౌకరి చాలైతదా... ఎప్పుడు బోతవ్ పట్నానికి అన్న మాటలకి సమాదానంగాఏం నౌకరో ఏమో మామ, గప్పుడు చదువుకొమ్మంటే ఇనకపోతి, గవర్నమెంటు నౌకరి రాకపాయే, గిప్పుడు అనుభవిత్తన్న తుమ్మితే, దగ్గితే ఊడిపోయే నౌఖర్లతోని వామ్మో తుమ్ముడు, దగ్గుడా... ఆ మాటలింటెనే భయమైతాంది, ఏం బతుకులోపో మా తాతలప్పుడచ్చిన గత్తర మల్ల పది తరాలకు గాని రాదన్నర్, దీనియవ్వ ఈ మయాదారి రోగం మనకే తగులాల్నా.... ఏమో మామ గీ రోగం రోజు రోజుకు పెరగవట్టె, ఐనాగని అన్ని చాలయితున్నయి, మా కంపెనీకేమైందో ఇంకా ఐతలేదు, పోదామంటే. ఏం జేయాల్నో అర్థమైతలే, ఆడికి బొయి ఏదో ఓటి సూసుకుందామంటే, ఏడుండాల్నో సమజైతలేదు, ఎంత జీతమిత్తరో ఏమోనని బుగులైతుంది, కిరాయికి భయపడి ఉన్నరూం ఖాళీ జేసి పెండ్లాం పిల్లల్ని ఈడికే తీసుకొత్తి, గిప్పుడు మళ్ల  బోవుడెట్లనో.. ఏమో... అవ్ రాజు నాకు తెల్వకడుగుతా... ఎందుకయ్యా మీకు గా పట్నం మీద గంత మోజు, ఏముంటదాడ, మాశెడ్డ లావు ఆరాటం గాకపోతే” “అరే.. ఏంది మామ గట్లనవడ్తివి, ఎంత సంపాదించినా.. ఆడి ఖర్చుల్ల బట్ట, పొట్టేనాయో, ఏమో బాగా సంపాదించి మిద్దెలు కడ్తినా.. మేడలు కడ్తినా... నీయవ్వ మంచిగనే అంటర్ పో పట్నపోల్లని” “గాకపోతే, రెక్కలురాంగనే పల్లెలిడిసిన బిడ్డలు మల్లొత్తుండ్రా... పల్లెబతుకు ఇగో సూడు మనూరి రాముల గుట్ట లెక్కయింది, ఎనుకట నక్కవాగొచ్చినప్పుడల్లా... గీ గుట్టమీదకేయి నీళ్లొచ్చి మన శెర్ల వడేటియి, ఎంత మంచిగుండేదో... గిప్పుడు మీరు బోయి చూత్తున్నరు జూడు ఆటర్పాల్స్ గట్ల, ఇటొచ్చే పిల్ల కాలువ రాను రాను పూడుకపోయి, లీళ్లు లేవు, అందం లేదు” “అవునే మా బాపుగూడ మస్తు సార్ల అంటడు గీ ముచ్చట అని మాట్లాడుకుంటూ ఈరయ్య మామ ఇల్లు రావడంతో దించేసి ఇంట్లో కెల్లేసరికి నా భార్య వాకిట్లనే ఎదురయిగా స్కూలోల్లు ఊకె సతాయిత్తండ్రు ఇప్పటికే రెండ్నెళ్లాయే, క్లాసులు ఇంటుండ్రు గని ఫీజు కడ్తలేరని నీయవ్వ ఈడు చదివే మూడో తరగతికి ఏమర్థమయితయే ఆన్లైన్ క్లాసులు, ఐనా మళ్ల పట్నం బోయేదెప్పుడు, ఆడ చదివిచ్చేదెప్పుడు, అప్పుడు గడ్ధాం తియ్, నువుగూడ ఊకె పోరన్ని సతాయించకు చదువూ... చదువూ... అని” “మంచిగనే ఉన్నది యవ్వారం పీజు ముచ్చటెత్తుతె చాలు సిగాలూగుతున్నవ్, అయింత స్కూళ్లకెయి తీసెత్తె మల్లబోయినంకా ఏడెత్తవ్ పోరన్ని, చిన్నదానికి గూడ యూకేజీ ఆన్లైన్ క్లాసులు షురువుజేత్తరు గావచ్చు, గప్పుడెట్ల మల్ల అని మాట్లాడుతుండగానే, బిడ్డా తమ్ముడు చవితికత్తుండట, ఆటోలు గిట్ల ఏం నడుత్తయో, ఎమో సిరిసిల్ల పోయి ఎక్కిచ్చుకరా, ఒకసారి పోన్ల మాట్లాడు ఎప్పుడత్తడోఇంట్లోకొస్తూనే చెప్పిండు బాపు, గామాట ఇన్నడో లేడు మా పెద్దోడు డాడీ, సిరిసిల్ల నేను వస్తా....కేక్ కొనుక్కుందాం అని మారాం చేశాడు, అప్పుడెప్పుడో కేక్ కావాలని గొడవ చేస్తే సిరిసిల్ల పోయినప్పుడు తెచ్చుకుందాం అని చెప్పిన ముచ్చట జ్ణాపకం ఉంచుకొనిగిప్పుడొద్దు బిడ్డా... కరోనా ఉంది గదా... బైటకి బోవద్దు, బైటయి తినొద్దు, నీకు అమ్మ చేసిత్తదితియ్ అని నచ్చచెప్పి, బిటెక్ పాసయి ఏదో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న తమ్ముణ్ని సిరిసిల్ల పోయి బైక్ పై ఎక్కించుకొని వస్తుంటేభాస్కర్, ఎట్లుందిరా, హైద్రాబాద్ అని అడిగిన గట్నే ఉందన్నా... అన్నైతే చాలయినయి, రోడ్లమీద జనం మనుపటిలెక్కనే తిరుగుతాండ్రు, లోపల్లోపటైతే బుగులున్నట్టే ఉంది గని, ఇగ తప్పుతదా... మరి.” “అవ్ మా కంపెనీ దిక్కు బోయినావురా... ఏమంటున్నర్, ఎప్పుడు చాలయితదటా...” “ఆ బోయినన్నా... మూసే ఉంది, టూరిజం కంపెనీ గదా... ఇంకా చానా రోజులయ్యేటట్టే ఉంది.” “వేరేదేదైనా చూడుమంటి గదరా... ఏమైంది ఆ అడుగుతున్న అన్నా... ఏవ్వలూ కొత్తయి తీస్కునేటట్టు గనవడ్తలేదు, చూద్దాం తియి కొన్ని రోజులు ఇట్లా మాట్లాడుతుండగానే ఇంటికి చేరుకున్నాం. రాత్రి అమ్మ చేసిన వంట తినేసి పడుకున్నాం. తమ్ముడొచ్చిండు గదాని పొలం పక్కనే ఉన్న ఈదుల్లో ఆశాగౌడ్ అన్నకి మంచి ఈత కళ్లు ఉంచుమన్న, తెల్లారి పోలంల లీళ్ల గలుమలు అన్ని చూసుకొనే సరికి ఆశాగౌడన్న కళ్లు తీసుకొచ్చి చెట్టుకింద పెట్టిండు, వచ్చేటప్పటికి ఇంకా తమ్ముడు లేవలే అందుకే ఒక్కన్నే పోలానికొచ్చిన, తమ్ముణికి పోన్చేసి రవిగాడత్తడు ఆన్తోటి బండెక్కి పోలం దగ్గరికి రారా కళ్లు తాగుదాం, అట్నే అచ్చేటప్పుడు ఎంకటేశ్గాని దూకాణ్లకేంచి ఫాలాల్లల్ల కారం కలుపుకొని తే అని చెప్పిన. ముగ్గురం కూసొని కళ్లు తాగుతున్నం, అబ్బా కళ్లు మస్తుందన్నా, చానా రోజులైంది మంచి కల్లు తాగక అన్నాడు తమ్ముడు, వెంటనే రవిగాడు అవ్ ఇయ్యాల్ల కల్లు మంచిగుంది, మెదుగాల్నే చెప్పినవా అన్నా అన్నాడు, అవున్రా, నిన్ననే చెప్పిన జర తమ్ముడత్తుండు మంచిదుంచే అని ఆశన్నకి” “గదీ సంగతి, నీయవ్వ ఊర్లకి అందరొచ్చేసరికి, రోజు దసరా లెక్కనే అయింది, కల్లుగూడ సరిగ్గ దొరుకుతలే, దొరకకపోతే మానే, సంబురంగుందే ఊర్ని చూస్తుంటే... పండగలకి, పబ్బాలకి కలకల్లాడే ఊరు, మీరంతా అచ్చేసరికి మస్తుగుందే. మళ్ల ఎప్పుడు బోతరే మీరంతా... అని రవిగాడనే సరికి గమ్మతనిపించింది, అవును నిజమే కదా దసరా పండుగప్పుడే కలకల్లాడే మా ఊరు గత ఐదునెల్లుగా ఇట్లనే ఉంది, ఈ మద్యనే ఒక్కొక్కరూ మళ్ళీ హైదరాబాద్లో పనులు మెదలయి పోతుంటే మల్లా మా పల్లె వెలిసిపోతున్నట్టనిపిస్తుంది. ఎక్కడ్రా అందరూ పోనేవట్టె, నీయవ్వ మా కంపెనే ఇంకా చాలయితలేదురా పోదామంటే అన్నాన్నేను, ఆ మాటలు వింటూనే రవిగాడుఎందుకన్నా ఈడ్నే ఉండరాదే, సాప్ట్ వేరోడు ఎవడత్తున్నడు గనుక, బాస్కరుగాడెట్లాగు ఊరికి రాడు, నువ్వన్న ఈడ్నే ఉండి ఐదెకరాళ్ళ మంచిగ పండిచుకుంట ఉండరాదె, గప్పుడంటె నీళ్లు లేవగని, గిప్పుడు మత్తుగనే ఉన్నయే మెల్ల మెల్లగా నిషా మెదలయే సరికి వాడి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి పోయేసరికి అమ్మ చికెన్ వండడంతో కడుపునిండా తినగానే నిద్ర ముంచుకొచ్చింది. నిద్రలో ఉండగానే డాడీ... లే... బన్నీగాడుగిట్ల వాటర్ పాల్స్ పోతుండ్రంటా మనమూ పోదాం లే...లే... పెద్దొడు అరుస్తూ ఊపడంతో నిద్రలోంచి మెలుకువ వచ్చింది. రోజూ కురుస్తున్న వానలకి మానేరుకి వరదొచ్చి, నర్మాల నిండిపోయి మత్తడి దుంకుతుందని ఒక్కొక్కరు పోయి చూసొస్తుండ్రు బిడ్డా... కరోనా ఉందిగదా, గిప్పుడొద్దు, మల్లెప్పుడన్న బోదాం తియ్ అనంగనే మా అమ్మ అందుకుంటూఅరేయ్, ఊకె కరీనా.. కరీనా... అనకురా, మత్తడి దుంకేటప్పుడు పోతే ముచ్చటగని, ఎప్పుడోబోతే ఏమత్తదిరా... మనం గూడ బోదాం తియ్ బిడ్డ అని మనుమన్ని సముదాయించింది, దానికి తమ్ముడు గూడఅవన్నా రేపు బోదాం, శీనుతాత ఆటో కిరాయి మాట్లాడుతా అందరం బోదాం అనడంతో ఇంటిళ్లిపాది దానికి వంత పాడారు,  కరోనాగురించి రోజూ మీడియా హడావుడి తప్ప గవర్నమెంటు ట్రీట్మెంట్ బాగుంది అని తెలవడం, ఊర్లో అక్కడక్కడా కేసులు వచ్చినా... పెద్దగా ఎక్కడా ప్రమాదాలు, తెలిసిన వాళ్ల చావులు లేకపోయే సరికి ఆ ఏమైయితది తియి అనే దైర్యం వచ్చినట్టుంది జనాలకి, బాగానే తిరుగుతన్నరు, మెల్ల మెల్లగా నార్మల్ అయితున్నరు. తెల్లారి అంతా నర్మాలకి పోయి చూసొచ్చుడు, మర్నాడు వినాయక చవితి పండుగలతోటి బిజీబిజీగా గడిచి, ఊరికే ఉండే దిగులు అంతగా బయటపడలేదు, రెండ్రోజులు గడిచాయి, రెండ్రోజులు ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం చేసినా వారంలో మూడ్రోజులు ఖచ్చితంగా ఆఫీసుకి వెళ్లాల్సి రావడంతో సెలవులు ఐపోయి హైదరాబాద్ వెల్లడానికి సిద్దమవుతున్న తమ్మునితో బాపుభాస్కర్, నీ ఉద్యోగం కుదుర్కున్నట్టేనా...మరి, బండలింగంపెళ్లోల్లు ఒకతీరుగ అడుగున్నరు, ఏమంటవ్ అని పెళ్లి గురించి అడగడంతో వాడు,బాపు, ఒక్కయాడాదాగు, కొంచెం పెద్ద కంపెనీల జాయినయినంక చేసుకుంటా” “అట్లగాదు బిడ్డా ఏ అయిసు ముచ్చట అప్పుడే తీరాలే” “ఎండకాలం దాంకనన్న ఆగు బాపు, ఇప్పుడచ్చే జీతం సరిపోదు అన్నమాటతో బాపుగూడ తమ్ముణ్ని భలవంతం చేయలే, ఏడాదిదాక కాదేమో అనుకొన్నోళ్లకి తమ్ముణి నోటితోనే ఎండకాలం అనే ఆర్నెల్ల మాట వచ్చేసరికి ఆగిపోయిండ్రు అమ్మ బాపులు. ఆ రోజు రాత్రి పడుకునే ముందు తమ్ముణితోఅరేయ్, ఏమన్నజేసి ఏదో ఓ నౌఖరి జూడ్రా...పదిగేనువేలచ్చినా సరె, గిప్పుడు హైద్రాబాద్ల రెంట్లుగూడ తగ్గినయట గదా, రేపో మాపో బళ్లు చాలయితే పోరన్ని తోలాలే గదా...” “నేను మస్తు ట్రై జేత్తున్నన్నా.... ఏడ లేవంటుండ్రు, గాకపోతే గా బట్టల షాపుల్లల్ల, దుకాండ్లల్ల ఉన్నయంటుండ్రు గని జీతం తక్కువ, పనెక్కువ, పొద్దంత నిలవడే ఉండాలె, అచ్చేటోళ్లకి కరోనా ఎవలకున్నదో తెల్వదు, గీటైంల అవసరమా అద్దన్నా... మా మాటలు వింటున్న అమ్మ కలుగజేసుకొని అవ్ బిడ్డా, మెన్నటిదాకంటే పండక ఏడ్తిమి, ఇప్పుడేమైంది బిడ్డా, మన బోరు నిరుటి యాసంగిల కూడా మూడెకరాలు పారిచ్చింది, రేపో మాపో మలకపేట నింపుతరట, మనకు కాల్వలు రాకున్నా భూమిల అంగాము నీళ్లుంటయ్, మంచిగ పండిచ్చికుంటే ఈన్నే నెలకు ముప్పైవేలు పడ్తయి బిడ్డా, జర సొచాయించురా వెంటనే బాపుఅవ్ బిడ్డా, నేనుగూడ గిదే జెప్దమనుకుంటున్నా, కానీ ఇంత చదువుకున్నోనివి ఏమనుకుంటవో అని ఆగిన, మాగ్గూడ ఇగ శాతనయితలేదు, నువ్వుంటే అన్నింటికి తోడుంటది. పంటగూడ మంచిగత్తుంది, ఆడేడ్నో బిక్కు బిక్కుమనుకుంట ఉన్నదానికన్నా ఈడ రాజులెక్కుండచ్చు బిడ్డా, గిప్పుడన్నిటికి ట్రాక్టర్లేనాయే పెయికి కట్టంగూడ తెల్వది బిడ్డా నా బార్య కలుగజేసుకుంటూమంచిగనే ఉంటదిగని అత్తా... పోరగాండ్ల చదువెట్లా... మేమే సక్కగ చదువుకోక ఇబ్బందులు పడ్తన్నమ్, పిల్లలకి చదువుల్లేకపోతే.... అమ్మ మాట్లాడుతూఈడ గూడ మంచి బళ్లున్నయి బిడ్డా... ఇంగ్లిపీసే గావాల్నంటే సిరిసిల్లకేయి ఇస్కూలు బస్సులు గూడ అత్తున్నయ్, ఆడికి పంపుదాము వెంటనే తమ్ముడుఔనన్నా... నాగ్గూడ నువ్వీడుంటనే మంచిదనిపిత్తుంది, ఒక్క వరే గాకుండా రక రకాల పంటలు, రక రకాల పద్దతుల్ల పండియ్యన్నా.... మంచి దిగుబడితో పాటు పైసలు గూడ ఎక్కువత్తయి, గిప్పుడు సర్కారు పాలీహౌజులకి, డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ లోన్లిత్తుంది, గా కొండాపూర్ల సురేష్ గాడు పాలీహౌజ్ పెట్టి కూరగాయలు పండిచ్చుకుంట నెలకి ముప్పైవేలు సంపాదిత్తుండు, నాటు కోళ్లతోని మల్లో ముప్పై వేలు తీత్తుండు, ఓసారి చూసిరా... నీకేం గావాల్నన్న మన పోన్లనుంచే పన్జేసుకోవచ్చు, ఆలోచించన్నా... అమ్మా నాన్నలు కూడా మళ్లీ మళ్లీ ఇదే ముచ్చట చెప్పిండ్రు. నా బార్య కూడా ఆ ఇరుకిరికు రూములకన్నా ఊరే మంచిగుంది అనుకుంటుంది, పిల్లల చదువులకి కూడా బెంగలేనట్టే అనిపించింది. ఇగ నేను కూడా ఒక నిర్ణయానికొచ్చేశాను, తెల్లారి తమ్ముణ్ని బస్సెక్కియ్యనీకి సిరిసిల్లల దింపి అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి పాలీహౌజ్తో పాటు, మినీ గోదాం కోసం అప్లికేషన్ పెట్టుకొని వచ్చిన, మూడు, నాలుగు నెలలు గడిచిపోయినయి, రోజు పొలం పనులకు తోడు పాలీహౌజ్లో మడులు కట్టడం, తీగలు చుట్టడం, కూరగాయలు, ఆకు కూరలు తెంపి సిరిసిల్ల మార్కెట్కి పంపడం. చాలా బిజీ అయిపోయింది. ఒక్క టమాట విషయంలో చాలా ఇబ్బందులొస్తున్నాయి ఒక్కసారే దర అమాంతం పడిపోయి గిట్టుబాటు కాదుకదా... కనీసం ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా రావడంలేదు. ఇంతలో ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి నక్కవాగు కాలువ పూడిక తీపియ్యడం కూడా అయిపోయింది. ఒకవైపు గోదాం పనులు కూడా చివరికొచ్చాయి. ఈ సారి బాస్కర్ హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు టమాట సాస్ తయారు చేసే మిషన్ తీసుకొచ్చిండు, దాంతో పాటు ప్యాకేజింగ్ చేసి అమ్మడానికి రికవరీ అనే బ్రాండ్ పేరుని రిజిష్టర్ చేయించి, స్టిక్కర్లు కూడా పట్టుకొచ్చిండు, టమాటాలని మార్కెట్కి తీసుకెళ్లకుండా నాణ్యమైన సాస్ తయారుచేసి మా ఊరితో పాటు చుట్టుపక్కల మండలాల్లో, సిరిసిల్లాలో అమ్మడం మెదలు పెట్టాను, మంచి నాణ్యతతో తాజాగా అందిచడంతో కొద్దిరోజుల్లోనే మా బ్రాండ్ మంచి పేరు తెచ్చుకుంది, గోదాం కూడా పూర్తవడంతో మా దాన్యంతో పాటు, మా ఊరి రైతుల దాన్యాన్ని కూడా నిలువ చేసి రేటు వచ్చినప్పుడు అమ్మడంతో పాటు రికవరీ బ్రాండ్ పేరుతో పురుగుమందులు లేని అన్నిరకాల దాన్యాలని సైతం ప్యాక్ చేసి అమ్మడం మెదలుపెట్టాను, ఇప్పుడు నేను, నాకుంటుంబంతో పాటు మా ఊరివాల్లు మరో పదిమందికి నేనే ఉపాది చూపగల్గాను. ఇలా ఆనందంగా జీవితం సాగిపోతున్నప్పుడే తమ్ముడి పెళ్లి కూడా జరిగిపోయింది. అప్పుడే కురిసిన వర్షాలకి నక్కవాగు పొంగిపోయి కాలువ రాముల గుట్టనుండి అందమైన జలపాతంలా చెరువులో కలుస్తుంటే మా ఆవునూరు ఇప్పుడొక పెద్ద టూరిస్ట్ ప్లేసయిపోయింది. ఆ జలపాతంలో సందడి చేస్తున్న మా పిల్లల్ని చూస్తూ ఒక్కసారి గతంలోకి జారిపోయాను, అంతా కలలా అన్పిస్తుంది, కరోనా విలయం నా జీవితాన్ని, మా ఊరిని ఎంతలా మార్చిందో తల్చుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. సంక్షోభంలో సైతం అవకాశాలు దాక్కొని ఉంటాయి, వాటిని అన్వేషించి అందుకుంటే విజయాలు ఎలా వరిస్తాయే నన్ను చూస్తేనే అర్థమయితుంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పుడూ ఎట్లాంటి కష్టం వచ్చినా అదిగమిస్తాననే నమ్మకం కుదిరింది. దీనికంతటికి కుటుంభ మద్దతుతో పాటు, సాదించాలనే కసి నన్ను ఎలా మార్చిందో, ఎలా రికవరీ చేసిందో అనుకుంటూ ఉండగానే పరుగెత్తుకుంటూ తడిబట్టలతో నా ఒళ్లో దుంకిన నాకూతురు డాడీ, దా ఫాల్స్ దగ్గరికి పోదాం రా... ఎంత మంచింగుందో అనడంతో ఈ లోకంలోకి వచ్చాను,   సరే తల్లి ఎక్కువ తడువకు సడిదయిద్దీ అనడంతో అక్కడే ఉన్న నాభార్యవామ్మె మళ్లా సడిదా...... అని ఆశ్చర్యంగా నవ్వడంతో నేను ఆమెతో నవ్వులు కలిపాను.

ప్రభుత్వోద్యోగమే పనికి పరమావదా?


 


పనినే దైవంగా భావించే సమాజం మనది, అనాదిగా నిర్వహిస్తున్న అనేక వృత్తుల ప్రాతిపదికనే మన పురాతన సంస్కృతి కొన్ని నిర్థిష్టమైన సంప్రదాయాలను ఏర్పరుచుకొని అభివృద్ది చెందుతూ వస్తుంది. పనిచేసేవాడికే విలువ, చేసే పని ఏదైనా అందులో నీతి, న్యాయం ఉండి తనతో పాటు తన కుటుంబం భుక్తికోసం ధర్మబద్దంగా పనిచేసి సంపాదించుకోవడమనేది ప్రతీ ఒక్కరి హక్కు. దురదృష్టవశాత్తు కాల క్రమంలో చేసే పని ఆదారంగానే వర్ణవ్యవస్థ రూపుదాల్చి, కులం అనే కబంద హస్తాల్లో అది చిక్కుకు పోయి పనిని బట్టి గౌరవం ఇవ్వడమనే దుష్ట సాంప్రదాయానికి తెరతీసిన విషాద చరిత్ర సైతం మనదే. నాటి ఆదిమ మానవుడు జీవనం కోసం వేటాడడం మెదలు నేటి ఆదునిక మానవుడి ఖండాంతర యానం వరకూ ప్రతీది తను చేసే పని ఆదారంగానే పరిణామక్రమం కొనసాగింది, అది కొనసాగుతూనే ఉంటుంది కూడా. పనే లేకుంటే ఈ ప్రపంచం లేదు. సృజనాత్మక ఆవిష్కరణలతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన పని కొందరిదైతే, ఆ ఆవిష్కరణలతో తమ జీవనాన్ని సరళికృతం చేసుకొని తమతో పాటు తమ సమాజాన్ని అభివృద్ది చెసిన పని అందరిది. ఇలా కేవలం ఆహార సంపాదనే ముఖ్యమైన పనిగా ఉన్న దశనుండి శాఖోపశాఖలుగా విస్తరించి, ఈ పనిలో చూపించే నైపుణ్యాల ఆదారంగా వారి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని మార్చుకునే స్థాయి వరకూ పని పరిణామం చెందుతూ వచ్చింది. ఐతే రాను రాను పని అనేది కేవలం సంపదని సృష్టించుకునే ఒక భౌతిక సాదనంగానే చూడడం మెదలైన నాటినుండి దీనికి అనేక రకాల జాడ్యాలు అంటుకున్నాయి. కేవలం ప్రాపంచికమైన విషయాల సాదనగానే పని మిగిలిపోయింది. ప్రభుత్వోద్యోగమే పరమావది అన్నా చందంగా తయారైంది. అలా ఇప్పుడు ఈ పనిని కల్పించడం అనేది ఒక రాజకీయ వస్తువుగా రూపాంతరం చెందింది. అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకోవడానికి అంశీభూతమవుతుంది. పని కల్పించడం కేవలం ప్రభుత్వాల పనే అనేంతగా మన మెదళ్లలో విషబీజాలు నాటుతున్నాయి నేటి రాజకీయాలు. ఉన్నత విద్యాభ్యాసం ముగించుకొన్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వమే పని కల్పించాలి అనే విపరీత దోరణి రాజకీయ విమర్శల్లో కన్పిస్తుండడం విచారకరం. ఇది కనీస ఆచరణ సాద్యం కాదనే అసలు నిజం వారికి తెలిసినా, అభూత కల్పనలైన వాదనలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పైచేయి సాదిస్తున్నామనే భ్రమలో యువకుల మెదళ్లని ఎంత విషపూరితం చేస్తున్నారో వారు గ్రహిస్తున్నారా? ప్రభుత్వోద్యోగమే సర్వరోగ నివారిణి, సంజీవని అనే ఈ మాటల ద్వారా చదువుకున్న వ్యక్తి సామర్థ్యాల్ని కుదిస్తున్నామన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కేవలం కొన్ని ఉద్యోగాలే ఉన్న ఈ సెక్టార్లో విపరీతమైన పోటీని పెంచి తద్వరా యువత ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నదెవరూ? ఇలా కేవలం ప్రభుత్వోద్యోగమే చాలని అనుకుంటే ఐన్ స్టీన్, స్టీపెన్ హాకింగ్, సచిన్ టెండుల్కర్, విశ్వనాథన్ ఆనంద్, బాలసుభ్రమణ్యం, బిల్ గెట్స్, స్టీవ్ జాబ్స్, జుకర్ బర్గ్, అంబానీ, టాటాలు పుట్టేవారా? నేడు వేలమందికి దైవ సమానమైన పనిని కల్పించేవారా? అందరూ ప్రభుత్వోద్యోగాలే ఎంచుకుంటే నవీన ఆవిష్కరణలు ఎవరు చేయాలి? కోటానుకోట్ల మానవులకి అవసరమైన అనేక ఉత్పత్తులు ఏలా సాద్యం? ఇంతటి ముఖ్యమైన విషయాల గురించిన ఆలోచన లేకుండా రాజకీయాలు కొనసాగుతుండడం మన దురదృష్టం, నిజానికి ఈ సమయంలో చేయవలసింది కసితో పనిచేసే యువతకి సరైన మార్గదర్శనం, వారిలో ఉన్న అంతులేని జ్ణానతృష్ణని వెలికితీసి, అనేక రంగాల్లో ఎదగడానికి ఉన్న అవకాశాల్ని పరిచయం చేయడం. ఉరకలేసే వారి ఉత్సాహానికి ఊతకర్రలా నిలబడి సాయం చేయడం. ప్రభుత్వోద్యోగంలో దొరికే సౌకర్యాలని అన్ని రంగాల్లో కల్పించేలా పోరాటాలు చేయడం. సమాజంలోని వ్యక్తుల వికాసాన్ని పెంచి వారి దృక్పథాలు మార్చి నవ సమాజం దిశగా తీసుకెళ్లే విద్యని అభ్యసించిన యువకులకి అవకాశాల్ని వెతుక్కునే సామర్థ్యం ఉందని తెలియజెప్పడం. వారిలోని నైపుణ్యాలని పెంచి అనేక రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. కేవలం దాదాపు నాలుగు లక్షల మంది మాత్రమే అవసరమైన ప్రభుత్వ శాఖల్లో నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డలకు అవకాశం ఎలా ఇవ్వగలం అనే వాస్తవికతను అర్థం చేసుకోవాలి. విమర్శలే ఎజెండాగా ముప్పైవేల ఉద్యోగాలే ప్రభుత్వం భర్తీ చేసింది. లక్ష ఉద్యోగాలేవీ అనే కోణాన్ని... ప్రైవేట్ రంగంలోని అపార అవకాశాలని తెలియజెప్పే దిశగా మార్చుకోవాలి. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాల్ని, వాటిలో పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్న లక్షలమంది ఉన్నారనే అభయాన్ని ఇవ్వాలి. అదేసమయంలో శ్రమదోపిడి జరుగుతున్న రంగాల్లో వాటిని అడ్డుకోవడానికి ఉన్న అవకాశాల గురించి అన్వేషించాలి. ఇవన్నీ ఒక్కరోజులో జరిగే మార్పులు కావు, కానీ వాటి దిశగా నేటి నుండి మన కార్యాచరణ ఉండేలా జాగరూకత వహించాలి. యువకుల కలలకి రెక్కలు తొడగాలి. ప్రభుత్వోద్యోగాన్ని మించిన పనులెన్నో ఉన్నాయని చాటిచెప్పాలి. ఇదే ప్రజాపక్షం వహించే వారి ఎజెండా కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం.

గంగాడి సుధీర్, జర్నలిస్ట్.

9394486053

21, సెప్టెంబర్ 2020, సోమవారం

రైతుకి ఏం కావాలి?

 

రైతుకి ఏం కావాలి?

భారతదేశం వ్యవసాయాదారిత దేశం అనే విషయాన్ని ఇంచుమించు మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి పాఠ్యపుస్తకాల్లో చదువుకోవడమే కాదు, ప్రతీ నేత నోటినుండి వింటున్న మాటే. కానీ ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న క్రుషి ఏంటి? తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడుబిల్లులు స్వేచ్చా విక్రయం, ముందస్తు ఒప్పందాలకి చట్టబద్దత, అత్యవసరాల నిల్వలపై ఆంక్షల ఎత్తివేతల వల్ల రైతుకి ఒరిగేదేంత? వ్యాపారికి మిగిలేదెంత? మనదేశంలో ఇప్పటికీ దాదాపు డెబ్బై శాతం మంది వ్యవసాయం, దాని అనుబంద రంగాలపై ఆదారపడి జీవనం కొనసాగిస్తున్న వారే, అయితే గత రెండు దశాభ్దాలుగా దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, పండగలా ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారుతున్నా సంస్కరణల పేరుతో ఎన్ని నూతన విదానాలు అవలంబించిన ఈ పరిస్థితి ఎందుకు ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది, మెక్సికోలో ఆహార సంక్షోభాన్ని అదిగమించడానికి సంకర వంగడాలని, క్రిమి సంహారక, రసాయన ఎరువులని వాడి హరిత విప్లవం పేరుతో పంట దిగుబడులని ఇబ్బడిముబ్బడిగా పెంచిన విదానాన్ని 1961లోనే భారత్ లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల సాగునీరు ఆదారిత వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచింది మెదలు, పింక్ రెవల్యూషన్, బ్లూ, రెడ్, వైట్, ఎల్లో, సిల్వర్, గోల్డన్ రెవెల్యూషన్ల పేరుతో ఒక్కో వ్యవసాయ ఉత్పత్తికి ఒక్కో రకమైన విదానాన్ని అవలంబించి సాధించిన ప్రగతి రైతు జీవితాల్లో మార్పులైతే తీసుకువచ్చింది కానీ అది సంపూర్ణంగా లేకపోవడానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది, ఇలా ప్రభుత్వం మేదోమధనాన్ని కొనసాగిస్తూ ఉన్న బడుగు, సన్న,చిన్నకారు రైతుల జీవితాల్లో ఎటువంటి మార్పులు సంబవించకపోవడం శోచనీయం. ఇలా స్వతంత్ర భారతంలోని డెబ్బై దశకాలు రైతుకి నిర్ధిష్టంగా ఏం కావాలి అనే దానిపై పరిశోదనలతోనే గడిచిపోయాయి, ఈ కాలంలో భాక్రానంగర్ ప్రాజెక్టు, హీరాకుడ్ ప్రాజెక్టు, తెహ్రీడ్యామ్, జయక్వాడి ప్రాజెక్టు, కలఘర్ ప్రాజెక్టు వంటి దేశవ్యాప్త ప్రాజెక్టులతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, దవళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వంటి భారి ప్రాజెక్టులతో పాటు చిన్నా చితకా అన్నీ కలిపి దాదాపు మూడువేల ఎనిమిది వందల ప్రాజెక్టుల ద్వారా అందుబాటులోకి వస్తున్న నీరు కన్నా వ్రుదాగా సముద్రంలో కలిసిపోతున్న నీరే అదికం అనే విషయం బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న డెబ్బైవేల టీఎంసీలని ఎలా ఉపయోగించుకోవాలి, దేశంలోని డెబ్బై కోట్ల ఎకరాల్ని ఎలా సాగులోకి తేవాలి అనే ప్రణాళికలపై చిత్తశుద్ది లేకుండా రైతులకోసం ఏం చేసినా అది తూతూ మంత్రం చర్య అనిపించుకోదా? ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మన దేశంలోని రైతాంగం కొట్టుమిట్టాడుతుంటే, పాలకులు చేసిన కొత్త చట్టాలు రైతులకి ఏమేరకు ప్రయేజనం చేకూరుస్తాయో గమనిస్తే వాటిలోని డొల్ల తేటతెల్లం అయిపోతుంది. దేశంలోని తొంబై శాతం కమతాలు చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. కేవలం ఐదెకరాల లోపు కమతాలే ఇందులో ఎక్కువ శాతం మరిలాంటి బక్క రైతులు తమ పంటల్ని ఎక్కడో ఉన్న సుదూర తీరాలకి తరలించుకుపోయి అమ్ముకోగలరా?  అప్పుల కోసం కల్లాల్లోనే పంటలని అమ్మడం కోసం దళారులు సిండికేట్ మాయాజాలంలో కనీస మద్దతు దరని కూడా సాదించుకొని బక్క రైతు పంటలని నిల్వ చేసుకొని రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలరా? ఇక ముందస్తు ఒప్పందాలకి చట్టబద్దత ద్వారా నకిలీవిత్తనాలు వేసి మోసపోయినప్పుడు ఎలాంటి పరిహారం వస్తుందో చెప్పని చట్టం, తర్వాత కార్పోరేట్లని ప్రశ్నించి ఒప్పంద అమలుకు ప్రభుత్వ యంత్రాంగమే లేనప్పుడు ఏం చేయగలుగుతాయి. దీని ద్వార కార్పోరేట్లకి ఒప్పందం అనే దొడ్డిదారిని కాస్తా రహదారిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? గుజరాత్లో పెప్సీకో కంపెనీ ఆలుగడ్డ రైతులని కోర్టుకి లాగిన ఉదంతాలు మనముందే కనబడుతున్నాయి. క్రమంగా రైతులనే వారిని లేకుండా చేసి కేవలం కూలీలని మాత్రమే ఈ చట్టాలు తయారుచేయవనే గ్యారంటీ ఏంటీ? రైతుల ముసుగులో కార్పోరేట్ శక్తుల్లోకి వ్యవసాయం దాని అనుభంద రంగాలు వెల్లిపోతే రక్షించే రక్షణ వ్యవస్థలు ఈ చట్టంలో ఉన్నాయా? ఒకవేళ ఉన్నా ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థీక్రుత అవినీతి విదానాలతో లాభం ఎవరికి? అతి సామాన్య వ్యక్తులకి కలుగుతున్న ఈ సందేహాలు చట్టం రూపకల్ఫన చేసే మోదావులకి రాకపోవడం విచారకరం, కనీసం వీటి నివ్రుత్తికి ఎలాంటి మార్గాలని సూచించారో ప్రజలకి వివరించకపోవడం బాదాకరం, ఇదే అంశంపై ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అకాళిదళ్ మంత్రివర్గంనుండి వైదొలిగినా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. స్థూలంగా రైతు ప్రయోజనాలే ఈ మూడు చట్టాల్లో కన్పిస్తున్నా ఆచరణలో దీనికి పూర్తి విరుద్దంగా జరుగబోతుంది అనేది ఈ ఆరునెలల ఆర్డినెన్స్ కాలమే నిరూపించిన ఉదంతాలు ఉన్నాయి. అసలు వ్యవసాయాన్ని సులభతరం చేసే మెకనైజేషన్ని చిన్న కమతాలకి ఎలా దగ్గర చేయాలో అనే తొందర లేకుండా ఈ చట్టాల వల్ల ఉపయోగమేంటి, ఒకవేళ ఈ చట్టాల్లోని సందేహాలన్నీ నిజమయి, అప్పుడు మెకనైజేషన్ తీసుకువస్తే ఖచ్చితంగా అది ఆత్మహత్యసద్రుశ్యమే. ఇప్పటికే వివిద రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతుల భాగోగుల కోసం అనేక రకమైన సంక్షేమ పథకాలని తీసుకువస్తున్నాయి, తెలంగాణ ఈ అంశంలో ఎంతో ముందుంది, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, నియంత్రిత పద్దతుల్లో డిమాండ్కి అవసరమైన పంటల సాగు, ఇరవైనాలుగ్గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరంతో కాలువల ద్వారా, భూగర్భజలాల పెంపు, రైతుబందు, రైతు భీమా, వంటి విప్లవాత్మక పథకాలతో రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని పండగలా చేయడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రైతుబందు స్పూర్తితో ఏడాదికి ఆరువేలు అందించే కిషాన్ సమ్మాన్ నిదిని ప్రవేశపెట్టిన కేంద్రం మిగతా విషయాల్లో ఎందుకు ఆదర్శాన్ని కొనసాగించలేకపోతుంది. ఖచ్చితంగా వ్యవసాయానికి అవసరమైన భూమి, నీరు, కల్తీలేని విత్తనాలు, సకాలంలో ఎరువులు, శ్రమని, సమయాన్ని ఆదాచేసే యాంత్రీకరణ పద్దతులు, పండిన పంటకి గిట్టుబాటు రేటు, రైతులే మార్కెటింగ్ చేసుకొనే వెసులుబాటు, ప్రక్రుతి వైపరీత్యాలు సంభవించినపుడు అన్నదాతకి అండగా నిలబడడం. ఇవీ ముఖ్యమైనవి వీటిపై ప్రభుత్వాలు శ్రధ్ద కనబర్చాలి, అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి అంతేకానీ ప్రక్రుతి వైపరీత్యాలతో, మార్కెట్ మోసాలతో అల్లాడుతున్న రైతుని రాజుని చేయకపోయినా ఫరువాలేదు, కూలీగా మాత్రం మార్చకండి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలపై సమగ్ర చర్చ జరగాలి, రైతులకి ఉండాల్సిన అన్ని రక్షణలని అందులో చేర్చాలి. అప్పుడే రైతుకిభరోసా దొరుకుతుంది. ఆ భరోసా ఇవ్వడమే ప్రభుత్వాల అతి ముఖ్యమైన భాద్యత.

 

గంగాడి సుధీర్, జర్నలిస్ట్



13, జులై 2020, సోమవారం

నా తెలంగాణ కంజాతవల్లివి

ఎంత పుణ్యఫలమో ఇవ్వాల నేనిక్కడ నిలబడి ఈ స్వేచ్చాగానాన్ని ఆలపిస్తున్నాను
ఇన్నేండ్లలో నా తెలంగాణా ఎన్ని లక్ష్యాలని ముద్దాడింది
ఎన్నెన్ని కలల్ని సాకారం చేసుకుంది
ఎంతెంత ఆనందాన్ని అనుభవించింది
వీటన్నింటికి కారణమై...
ఇవ్వాల్టి తెలంగాణా ప్రజలందరి బతుక్కి తోరణమై....
మెరిసే పుణ్యజీవుల్ని స్మరించుకోవడమే...
నా స్వేచ్చాగానానికి నిండుదనం.
ఎవరెన్ని చెప్పినా....
చరిత్ర ఎలా రాసినా....
ముమ్మాటికీ నా ఈ నేల రత్నగర్బగా..
కోటి రతనాల వీణగా...
రాగాలాపనలలో.....
శ్రుతి, లయ, రాగం, భావం
ఆత్మబలిధానాలతో ఆచరణకి బాటలు వేసిన నా అమరులకే అగ్రతాంబూలం.
రేపన్నది స్వరాష్ట్రంతోనే ఉంటుందని చైతన్యం చేసిన త్యాగశీలులదే దార్శనికం.
స్వరాష్ట్రం మా జన్మహక్కని చాటిన నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజలదే అంతిమ విజయం.
1961లొ విఫలమైన చోట 2014లో విజయాన్ని ముద్దాడడం వెనుకనున్నది ఖచ్చితంగా నాయకత్వ వ్యూహం
నేడు చూస్తున్న కుళ్లు రాజకీయాల్లో...
ఎవడేమైపోతే నాకేంటి అనుకునే కుఠిల కపటత్వంలో...
ఆమె ఏ ప్రయేజనాలని ఆశించిందో....
ఏ ఎత్తుల జిత్తులతో ఆటాడిందో....
కానీ తల్లీ....
నువ్వు లేకపోతే....
నువ్వంత కఠినంగా లేకపోతే...
తలుపులు మూసైనా...మా తలపులని నెరవేర్చకపోతే....
నాకల కల్లనే ఔను.
నాకల రావణ కాష్టంలా రగులుతూనే ఉండు.
ఇంకా ఎన్నో బలిదానాలు సాగుతూనే ఉండు.
అందుకే..... అందుకే.....
అమ్మా....
నీ జాతియత నాకక్కరలేదు
నీ మతం నేనెరుగను
నీ కులగోత్రాల ఊసు నాకొద్దు
నువ్వే నా తల్లివి
నా తెలంగాణ కంజాతవల్లివి
జై తెలంగాణ జై జై తెలంగాణ


ఇవ్వాలేమైంది నీకు.....

ఇవ్వాలేమైంది నీకు....
గ్రీష్మంలో మోడువారినప్పుడు కూడా
తాపంతో తరుక్కుపోయిన నామోములో అరుణారుణకాంతుల్ని చూసినవాడివి
శిశిరంలో గడ్డకట్టుకపోయినప్పుడు కూడా
విడివడిన బిందువుల్ని మంచులా బందించి అల్లుకుపోయినవాడివి
ఇవ్వాలేమైంది నీకు....
ఆశాడ మేఘంలో ప్రేమలేఖల్ని నీటి బిందువులుగా చేసి
అవనిపై అల్లుకుపోయే తీగల్ని ముద్దాడడానికి వర్షంగా నేను వస్తుంటే....
పూల రెమ్మల్లోంచి పుప్పొడి మోహంతో కైపెక్కి
ఎదురుగాలుల్ని చీలుస్తూ నీ యదసడికోసం తుమ్మెదనై నేనొస్తుంటే....
ఎక్కడిదీ ప్రచండ మారుతం
ఏమిటీ విది వైపరీత్యం
ఎడబాటు కోసం ఎవరు స్రుష్టించారి తడబాటు
నిను కలువద్దంటుంది
తనువులు తగలద్దంటుంది
వసంతం వేసిన చిగురులు మ్రుగశిర తొలకరి కోసమేగా....
మట్టిని ముద్దాడే విత్తు చివురుల మెలకల కోసమేగా...
ఉరకలై పరుగులెత్తే గంగమ్మ సముద్రుడి సాన్నిత్యం కోసమేగా....
ఇదే కదా ప్రక్రుతి
దీన్ని విక్రుతి చేసిందెవరు
ఆత్మీయ ఆలింగనాలు లేకుండా
మనసారా పలకరింపులు లేకుండా
ఇవ్వాలేమైంది నీకు.....